రుతుపవనాలు రాష్ట్ర ప్రవేశం
విశాఖపట్నం: ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరించనుందని వాతావరణ పరిశోధన శాఖ తెలియ చేసింది. నాలుగు రోజుల క్రితం అండమాన్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని నెల్లూరును తాకవచ్చునని వాతావరణ నిపుణుడు మురళీకృష్ణ తెలిపారు.
సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది మే 23వ తేదీ నాటికే రావచ్చని వాతావరణ శాఖ గత నెలలోనే ప్రకటించింది. అందుకనుగుణంగానే 20న అండమాన్ను పలుకరించాయి. అండమాన్, దానికి ఆనుకుని బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. అనంతరం అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి.
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు , దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయి. తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో ఒకటవ నంబరు భద్రతా సూచికను ఎగురవేశారు.