జలంధర్ లో అల్లర్లు: నిరవధిక కర్ఫ్యూ
జలంధర్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ అట్టుడుకుతోంది. జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కోచ్ లకు అల్లరి మూక సోమవారం నిప్పు పెట్టింది. ఒకటో నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేసింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని గురుద్వారాలో ఘర్షణలకు నిరసనగా జలంధర్ లో అగ్గి రాజుకుంటోంది. వియన్నాలో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు.
అల్లరి మూకను అదుపు చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపారు. జలంధర్ పరిసర ప్రాంతాలకు కూడా అల్లర్లు పాకాయి. జలంధర్ లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన అల్లర్లు సోమవారంనాడు పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు పాకాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను అల్లరి మూక దగ్ధం చేస్తోంది. అమృతసర్, ఫాగ్వారా, నకోడార్, దవోబా, హోషియార్ పూర్ ల్లో అల్లర్లు చెలరేగాయి. చండీఘడ్ లో హై ఆలర్ట్ ప్రకటించారు. శాంతిని కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.