ఆస్ట్రేలియాపై వాయలార్ రవి గరం
న్యూఢిల్లీ/మెల్బోర్న్: భారతీయ విద్యార్థులపై వరుస దాడుల జరుగుతుండడంపై ఇండియన్ ఓవర్సీస్ వ్యవహారాల మంత్రి వాయలార్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్నా ఆస్ట్రేలియా వాటిని నిరోధించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన శుక్రవారం విమర్శించారు. దాడులపై ఎప్పటికప్పుడు సమీక్షించి తాము తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
భారతీయ విద్యార్థులపై దాడులను అరికట్టడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆస్ట్రేలియాలోని భారత హై కమిషనర్ సుజాతా సింగ్ అన్నారు. విక్టోరియా ప్రీమియం జాన్ బ్రూంబీని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసిన తర్వాత ఆమె క్రిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని దాడుల్లో జాతి వివక్ష లక్షణఆలున్నాయని, కొన్ని మాత్రం కేవలం దొంగతనం కోసమే జరిగినవని ఆమె అన్నారు.
దాడులకు కారణమేదైనప్పటికీ వాటిని ఆపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దాడులకు భారతీయ విద్యార్థులే లక్ష్యంగా మారారని ఆమె అన్నారు. ఈ దాడులు ఆగుతాయని ఆశిస్తున్నామని, అందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె అన్నారు. దాడులు ఆపడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా అధికారులు హామీ ఇచ్చినట్లు సుజాతా సింగ్ చెప్పారు. చదువుకోవడానికి ఆస్ట్రేలియా సురక్షితమైందేనా అని అడుగుతూ తనకు ఎన్నో ఇ మెయిల్స్ వస్తున్నాయని, పరిస్థితి ఆ విధంగా ఉందని ఆమె అన్నారు.