చంద్రబాబుపై చిరు బుర్రులు
ఇక నుంచి ఎవరితోనైనా తాను నేరుగా మాట్లాడుతానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనతో ఎవరైనా మాట్లాడే విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని ఆయన చెప్పారు. ఇంతకు ముందు కూడా తాను అందరితో నేరుగా మాట్లాడుతున్నానని, దాన్ని మరింత పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై ఉన్న మంచి అభిప్రాయం వల్లనే కాంగ్రెసు పార్టీ విజయం సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము కుర్చీ మీద కూర్చోవాలని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే వచ్చానని ఆయన చెప్పారు. ఇవియంలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే తాము అందుకు సానుకూలంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని ఆయన చెప్పారు. అందుకు సీనియర్ల సేవలను ప్రత్యక్షంగా వాడుకుంటామని ఆయన చెప్పారు.
తొలుత హైదరాబాద్ పై దృష్టి సారిస్తామని, ఆ తర్వాత మిగతా పార్టీ వ్యవస్థను పటిష్టం చేస్తామని, ఇదంతా పూర్తి కావడానికి రెండు నెలల కాలం పడుతుందని ఆయన చెప్పారు.