డిఎస్సీ గందరగోళం: యువతిపై దాడి
హైదరాబాద్: నిజామాబాద్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్ష రాయడానికి వచ్చిన ఒక యువతిపై దుండగులు దాడి చేశారు. యువతిపై దాడి చేసిన దుండగులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన డిఎస్సీ పరీక్ష సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.
ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతించమని నిర్వాహకులు ముందే ప్రకటించటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవడానికి ప్రయత్నించారు. అయితే పరీక్షా కేంద్రాల చిరునామాలు సరిగా లేకపోవడంతో అభ్యర్థులు సకాలంలో చేరుకోలేకపోయారు. హైదరాబాదులోని పలు చోట్ల అభ్యర్థులు ఈ విషయంలో గందరగోళానికి గురయ్యారు. కూకట్ పల్లిలో 30 - 40 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. లోనికి అనుమతించబోమని నిర్వాహకులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేంద్రాలు మారూమూల పాఠశాలలు కావడం అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. విజయనగరంలో కూడా ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 2,660 సెంటర్లలో ఆరు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. 52వేల పోస్టులు ఉన్నాయి. ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్జీబీటీ పరీక్షలు, ఒంటిగంట నుంచి 5 గంటలవరకు భాషా పండితులకు పరీక్షలు జరుగుతాయి.