ఆసీస్ లో భారత విద్యార్థుల ఆగ్రహం
మెల్బోర్న్: తమపై పెరుగుతున్న దాడుల పట్ల ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక విద్యార్థిని కత్తులతో పొడవటం, మరో విద్యార్థిపై పెట్రోల్ బాంబు విసరడం వంటి సంఘటనలతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాడులను నిరసిస్తూ మెల్బోర్న్ లో ప్రదర్శనలు నిర్వహిస్తామని తమకు ఎడతెరిపి లేకుండా మెయిల్స్ వస్తున్నాయని భారత విద్యార్థి సంఘాల సమాఖ్య (ఎఫ్ ఐఎస్ ఎ) చెబుతోంది.
అటువంటి ప్రదర్శనలు నిర్వహించడం తొందరపాటు అవుతుందని, భారత విద్యార్థుల పరిస్థితిపై భారత, ఆస్ట్రేలియా అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాఖ్యం అధ్యక్షుడు గౌతం గుప్తా అన్నారు. ఈ సమయంలో బాధితుల ఆరోగ్యం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు గత రాత్రి 300 కాల్స్ వచ్చాయని, వాటిలో 200 కాల్స్ ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పడానికి వచ్చాయని ఆయన చెప్పారు. అయితే భారత సమాజం ఈ సమయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు.