భయంతోనే చిరు మీటింగ్?
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వలసవచ్చిన నేతలతో ఆదివారం చిరంజీవి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వలసవెళ్ళిన నేతలను చంద్రబాబు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నిన్న అల్లు అరవింద్, నేడు చిరంజీవి ఇలా సమావేశాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అల్లు అరవింద్తో వలస నేతలు తాము పార్టీని వీడి వెళ్ళేది లేదని స్పష్టం చేసిన దరిమిలా మళ్ళీ వారితో ప్రత్యేకంగా చిరు భేటీ కావడం వెనుక ప్రజారాజ్య సంస్థాగత పునర్నిర్మాణ వ్యూహం కూడా దాగివున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. టిడిపిలోకి తిరిగి వెళ్ళనున్నట్లు వచ్చిన వార్తలను తమ్మినేని ఖండించడం తెలిసిందే.అయితే చంద్రబాబు పిలుపు మేరకు వలస వెళ్ళిన వారు టీడిపిలోకి తిరిగి వెళ్ళిపోతారని భయపడే ఈ మీటింగ్ చిరంజీవి ఏర్పాటు చేసారని టీడీపి నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు.