సినిమాల్లో చూపినట్లు లేదు..హోం మంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలోని జైళ్లలో సినిమాల్లో చూపించేంత భయంకరమైన పరిస్థితులు లేవని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించే విషయంలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆమె హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రథమ మహిళా హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమెశనివారం చంచల్గూడలోని మహిళా కారాగారాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ సాటి మహిళగా మహిళా ఖైదీల ఇబ్బందులు తెలుసుకోవడానికి జైలుకు వచ్చానని తెలిపారు. అయితే సినిమాల్లో చూపించేంత దుర్బర పరిస్థితులు జైళ్ళలో లేవని ఆమె అన్నారు. చంచల్గూడ జైలు నిర్వహణ బాగా ఉందని ప్రశంసించారు. తాను వచ్చినందుకు కాకుండా ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆమె అధికారులకు సూచించారు.
మహిళా ఖైదీల కోసం తయారు చేసే భోజనాన్ని పరిశీలించేందుకు హోంమంత్రి స్వయంగా వంటశాలను సందర్శించారు. టిఫిన్, భోజనంలో వడ్డించే పదార్థాలను చిన్న గిన్నెల్లో హోంమంత్రి కోసం అధికారులు తయారుగా ఉంచారు. అక్కడి పరిసరాలను, వంటకాలను పరిశీలించిన సబిత పప్పు, ఇతర కూరలను తిని సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు అక్కడ ఉండి జైలులోని వివిధ విభాగాలు, బ్యారక్లు సందర్శించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బెయిలు దొరక్క ఏళ్ల తరబడి అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గుతున్న మహిళలు హోంమంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.