రచయిత్రి కమలాదాస్ కన్నుమూత
పుణె: పురుషాధిక్య సమాజం, ఛాందసవాద భావాలపై పోరాడిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి కమలాదాస్ సురయ్యా (75) కన్నుమూశారు. కేరళలో జన్మించిన ఆమె మహారాష్ట్రలోని పుణెలో తుది శ్వాస వదిలారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 18న ఆస్పత్రిలో చేరిన కమలా దాస్ ఆదివారం తెల్లవారుజామున శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులున్నారు. కమలాదాస్ భర్త మాధవ దాస్ రిజర్వు బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు. ఆయన చాలా ఏళ్ల క్రితమే మరణించారు.
కథలైనా, కవితలైనా, ఎలాంటి రచనలనైనా అతి సులువుగా, ఆసక్తికరంగా రాయగలిగే సమర్థురాలు కమలాదాస్. కేరళలోని సంప్రదాయ 'నాయర్' కుటుంబంలో ఆమె జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీ ప్రముఖులే. తండ్రి నారాయణ మీనన్ తన స్వీయ రచనలతోపాటు మరెన్నో ప్రముఖ పుస్తకాలను మలయాళంలోకి అనువదించారు. తల్లి బాలమణియమ్మ మాతృత్వంపై అనేక కవితలు రాశారు. సాహితీ వారసత్వం పుణికిపుచ్చుకున్న కమలాదాస్...సైద్ధాంతికంగా భిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. బలవంతంగా రుద్దిన విధానాలు, అహేతుకమైన సంప్రదాయాలంటే ఆమెకు గిట్టదు. వీటి నుంచి బయటపడి ఆమె రచనలు, జీవితం సాగించారు.
పురుషాధిక్య సమాజంలో దెబ్బతిన్న మహిళల మనోభావాలకు ఆమె తన రచనల ద్వారా అద్దంపట్టారు. ఛాందసవాద భావాలపై తన కలాన్నే కత్తిలాగా దూశారు. ఆమె రాసిన ఆంగ్ల కవితలైనా,మలయాళ కథలైనా సమాజంలోని హిపోక్రసీని దునుమాడటమే లక్ష్యంగా సాగాయి. పదాల్లో అంతులేని పొదుపు పాటిస్తూనే పాత్రల చిత్రణలో ఏమాత్రం రాజీపడని శైలి ఆమె సొంతం. కమలాదాస్ పదేళ్ల క్రితం ఇస్లాం స్వీకరించి సురయ్యాగా మారారు. ఆమె ఇస్లాం పుచ్చుకోవడం, బురఖా ధరించడాన్ని ఛాందసవాదులు నిరసించినా లెక్కచేయలేదు.