అలసత్వం వద్దు: కలెక్టర్లతో వైయస్
చిన్న తప్పునైనా ఉపేక్షించవద్దని, ఒక్క తప్పును ఉపేక్షిస్తే అటువంటి తప్పులే జరుగుతూ పోతాయని, అందువల్ల చిన్నదే కదా అని వదిలేయవద్దని ఆయన అన్నారు. అవినీతిని ఎక్కడా సహంచవద్దని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా సరిగా లేకపోతే చేయవద్దని, ఆ విషయం అర్థమయ్యేలా ప్రజాప్రతినిధులకు వివరించాలని, ఒక్క పని చేస్తే అటువంటివే వస్తూ ఉంటాయని ఆయన అన్నారు. తాము కొత్త కార్యక్రమాలను చేపట్టడం లేదని, అమలులో ఉన్న కార్యక్రమాలనే మరింత సమర్థంగా, ప్రజలకు మరింత మేలు జరిగేలా వాటిని అమలు చేయాలని ఆయన చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఎలా అమలు చేయాలో, వాటి వల్ల పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆయన వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాధ్యమైనంత ఎక్కువ పనులు కల్పించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. బడి బాట కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రతి పిల్లవాడు, పిల్లా బడికి వెళ్లేలా చూడాలని కూడా ఆయన చెప్పారు.