మాదంతా మానవత్వం..చిరంజీవి
హైదరాబాద్ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ, టెక్కలిలో పోటీ విషయంలోనూ తాము మానవతా దృక్పదంతో వ్యవహరించామే తప్ప అందులో తాము కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నామని అనుకోవడానికి వీలు లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాలపై వివరణ ఇస్తూ రాష్ట్ర శాసనసభ స్పీకరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోందని, అందువల్లనే తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్రెడ్డిని స్పీకరు పదవికి బలపరిచామని ఆయన వివరించారు. గత ఎన్నికల్లో టెక్కలి నుండి గెలిచి ఇటీవలే ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే స్థానంనుండి తాము పోటీ చేయబోమని పీఆర్పీ ప్రకటించింది. రేవతీపతి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీకి నిలిపితే మానవతాదృక్పథంతో తమ పార్టీ అక్కడ అభ్యర్థిని పోటీకి పెట్టదని చిరంజీవి చెప్పారు.
అయినా ప్రతి చిన్న విషయానికి రాజకీయం అంటగడితే ఎలాగా అని ఆయన మీడియాను ప్రశ్నించారు. కేవలం తాము మానవతాదృక్పథంతోనే పోటీకి నిలబెట్టడం లేదని ప్రకటించామని ఆయన పేర్కొన్నారు.