ఒత్తిళ్లకు తలొగ్గదు: వైయస్
ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ బాధ్యతను విస్మరించి అవినీతికి పాల్పడ్డ అధికారులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టంచేశారు. అధికార యంత్రాంగం నీతి, సమర్థతల్లో రాష్ట్రమే మొదటి స్థానంలో ఉన్నా, అక్కడక్కడా కొందరు అవినీతి అధికారుల ప్రవర్తన వల్ల చెడ్డపేరు వస్తోందని అన్నారు. దీన్ని అరికట్టడానికి అవినీతి అధికారులను ప్రాధాన్యం లేని పదవుల్లో నియమిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా కూడా దాడులు కొనసాగించి, కేసులు నమోదు చేయడంపై ఏసీబీ అధికారులను వైఎస్ అభినందించారు.
అవినీతిని అరికట్టడానికి మూడంచెల విధానం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల కార్యకలాపాలన్నింటిని పారదర్శకంగా ఆన్ లైన్ లో అమలు చేయడం, అవినీతి సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమని, ప్రజలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పథకాల అమలు, సమర్థంగా సామాజిక తనిఖీలు జరగాలని ఆయన అన్నారు. ఏసీబీ దాడులు మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆదేశించారు. 2004కి ముందు ఏసీబీకి అడుగడుగునా కళ్లెం వేయడం వల్ల ఆ సంస్థ నిర్వీర్యమైందని, తమ ప్రభుత్వ హయాంలో ఆ సంస్థతో పాటు ఇతర నిఘా సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో నడుస్తున్నాయని వైఎస్ అన్నారు. 1995 నుంచి ఏసీబీ కేసుల వివరాలను ఈ సందర్భంగా డీజీ గిరీష్ కుమార్ సీఎంకు వివరించారు.