ఆస్ట్రేలియన్ పై ప్రతీకార దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కొన్ని వారాలుగా భారతీయ విద్యార్థులు లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అనూహ్య సంఘటన జరిగింది. ఒక భారత విద్యార్థుల బృందంపై జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అనంతరం 20 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఒకతను కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం రాత్రి మెల్బోర్న్ నగర పశ్చిమ శివారులో ఈ సంఘటన చోటుచేసుకొంది. దీనిని తమపై దాడులకు వ్యతిరేకంగా ఇక్కడి భారతీయులు చేసిన తొలి ప్రతీకార దాడిగా భావిస్తున్నారు.
భారతీయులపై వరుస దాడుల నేపథ్యంలో న్యూఢిల్లీ ఆగ్రహాన్ని చల్లార్చేందుకా అన్నట్లు కెవిన్ రుడ్ ప్రభుత్వం ఒక భారతీయ ఆస్ట్రేలియన్ ను భారత్ లో తమ తదుపరి హైకమిషనర్ గా నియమించింది. కత్తిపోట్లకు గురైన ఆస్ట్రేలియా యువకుడు అంతకుముందు భారత విద్యార్థులనుద్దేశించి జాతివివక్షతో దుర్భాషలాడినట్లు సమాచారం. "మీరు నల్లజాతీయులు. మీరు ఇక్కడివాళ్లు కాదు. మా దేశం నుంచి వెళ్లిపోండి" అంటూ వారిని అతడు దూషించినట్లు 'ది ఏజ్' పత్రిక వెల్లడించింది. ఈ సంఘటనకు సంబంధించి 23 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు ముదురు రంగు యువకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.