బాబుపై నల్లపరెడ్డి తిరుగుబాటు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ కోవ్వూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరమయ్యామని, పొరపాట్లను సరిదిద్దుకోకపోతే ప్రజలను తమను క్షమించరని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ ఎన్నిక విషయంలో చంద్రబాబు తొందర పడ్డారని, స్పీకర్ పదవికి పోటీ దిగాలని ముందు నిర్ణయించుకుని తర్వాత విరమించుకోవడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి శాసనసభలో తమ పార్టీ నాయకుడు పి.అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ట దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.ఇకనైనా కోటరిని వెనక్కి పెట్టాలని ఆయన చంద్రబాబును కోరారు. తెలుగు మాట్లాడడం కూడా అశోక్ గజపతి రాజుకు రాదని, అటువంటి నాయకుడి చేత మాట్లాడించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ లేఖపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని వీడేందుకే ప్రసన్నకుమార్ రెడ్డి ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పి.అశోక్ గజపతి రాజు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఎవరి విజ్ఞత వారికి ఉంటుందని ఆనయ అన్నారు.