అడ్వొకేట్ జనరల్ గా సీతారామమూర్తి
హైదరాబాద్: రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా డి.వి.సీతారామమూర్తి నియమితులయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందుకొన్న వెంటనే సోమవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సి.వి.మోహన్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం కొత్త ఏజీగా డి.వి.సీతారామమూర్తిని నియమించింది. బాధ్యతలను స్వీకరించే ముందు మూర్తి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.ఆర్.దవేను కూడా కలిశారు.
సీతారామమూర్తి 1952 మార్చి 11న జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయవాద పట్టా పొందిన ఆయన 1976లో బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. హైకోర్టు మొదటి అడ్వొకేట్ జనరల్ డి.నరసరాజుకు మూర్తి మేనల్లుడు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ డి.వి.సుబ్బారావు కార్యాలయంలో మూర్తి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 1983లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, 1985లో ప్రభు త్వ న్యాయవాదిగా, 1989 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించారు. 2007లో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతున్న ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు కొత్త ఏజీ సూచన మేరకు ఇప్పటికే రాజీనామాలు చేశారు. విషయం తెలియని మరికొందరు మంగళవారం రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుత జీపీల్లో 15 మందిని పైగా మార్చనున్నారు.