వైయస్ మారలేదు: కిషన్ రెడ్డి
ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని, ప్రమోట్ మాత్రమే అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. సీట్ల పరంగా మాత్రమే కాంగ్రెసు పార్టీ గెలిచిందని, నైతికంగా కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల వోట్లు చీలడం వల్లనే కాంగ్రెసు పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గతంలో కన్నా వోట్ల శాతం చాలా తగ్గిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు 36 శాతం వోట్లు మాత్రమే వచ్చాయని, 64 శాతం మంది వోటర్లు కాంగ్రెసును తిరస్కరించారని ఆయన అన్నారు. ఇది కాంగ్రెసు ఓటమి మాత్రమేనని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో వేర్పాటువాదం అనే పదాన్ని వాడడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని వేర్పాటువాదంగా చిత్రీకరించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు కుమ్మరించారని, ఈ విషయంలో శాసనసభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. తాను ఒక్క పైసా కూడా వోటర్లకు పంచలేదని ఆయన చెప్పారు. తనపై పోటీ చేసిన మంత్రి డబ్బులు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. పైసా ఖర్చు పెట్టకుండా తాను గెలిచి వచ్చానని ఆయన చెప్పారు.