విద్యుత్ పరికరాల పరిశ్రమకు ఆమోదం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బీహెచ్ ఈఎల్, ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకోసం 750 ఎకరాల భూమిని ఎకరాకు వంద రూపాయల చొప్పున కేటాయిస్తారు. ఈ పరిశ్రమ శంకుస్థాపనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. మంత్రి వర్గ సమావేశం వివరాలను సమాచారం మంత్రి జె.గీతారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో అందించారు.
ఈనెల 22నుంచి ప్రతి సోమవారం జిల్లా సమీక్షలు జరపాలని కూడా సీఎం నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు గీతారెడ్డి చెప్పారు. పార్టీ వ్యవస్థాగత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. కడప జిల్లా పొద్దుటూరులో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు 115 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.