కెసిఆర్ కు సన్ స్ట్రోక్: ఆగని లొల్లి
హైదరబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు తనయుడు కెటి రామారావు లక్ష్యంగా ఆ పార్టీలో అసమ్మతి ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైఫల్యానికి కారణాలేమిటో, ఎవరు దానికి కారణమో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో తేల్చాలని ఆ పార్టీ అసమ్మతి నాయకుడు ఎ.చంద్రశేఖర్ డిమాండ్ చేస్తున్నారు. కెటి రామారావు పెత్తనం వల్లనే పార్టీ నష్టపోయిందనేది పార్టీ అసమ్మతి వాదుల అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 30 మంది అసమ్మతి వాదులు శుక్రవారం రహస్య సమాలోచనలు జరిపారు. తిరిగి శనివారం కూడా వారు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో రవీంద్రనాయక్, విజయరామారావు, కెకె మహేందర్ రెడ్డి, చంద్రశేఖర్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. కెసిఆర్ కు వీరంతా గతంలో వెన్నుదన్నుగా నిలిచినవారే.
శుక్రవారంనాటి సమావేశంలో దాదాపు 30 మంది నాయకులు పాల్గొన్నట్లు సమాచారం. కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా వారికి పార్టీని విడిచి పెట్టే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం మారాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా చురుకైన నాయకుడిని ఎంపిక చేసుకుని కెసిఆర్ ను పెద్ద దిక్కుగా పెట్టుకోవాలనేది వారి అభిమతమని అంటున్నారు. పార్టీలో కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవితల జోక్యం పెరిగిపోయిందని, దీనివల్లనే సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. పొరపాట్లు జరిగాయని, వాటిని సమీక్షించి సరిదిద్దుకుంటామని కెసిఆర్ శుక్రవారం చెప్పారు. అయితే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అనే అభిప్రాయం కూడా ఉంది. సమీక్షలు తూతూ మంత్రంగా సాగించడం కెసిఆర్ కు అలవాటేననే అభిప్రాయం కూడా ఉంది.