తెరాస సమావేశం: కెసిఆర్ పై ఒత్తిడి
సమావేశానికి కెసిఆర్ కుమారుడు కెటి రామారావు మాత్రం హాజరయ్యారు. ఏమి జరిగేది తనకు ఇప్పుడే తెలియదని, ఏ విధమైన వ్యాఖ్య చేయడానికైనా ఇది సమయం కాదని కెటి రామారావు మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కెసిఆర్ కు వ్యతిరేకంగా సమావేశంలో నినాదాలు చేసిన ఒక వ్యక్తిపై తెరాస కార్యకర్తలు విరుచుకుపడ్డారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ పదవులకు రాజీనామా చేసిన విజయశాంతి కెసిఆర్ రాజీనామాను ఉపసంహరించుకోకపోతే తాను కూడా వెనక్కి తగ్గబోనని అంటున్నారు.
కెసిఆర్ తో శాసనసభ్యుడు హరీష్ రావు శనివారం ఉదయం చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, నాయని నర్సింహారెడ్డి కెసిఆర్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ వంటి నేతలు కెసిఆర్ కు పూర్తి మద్దతు అందజేస్తున్నారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉండదని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెరాస కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దనే కాకుండా కెసిఆర్ నివాసం వద్ద కూడా ధర్నాలు చేశారు.