కాంగ్రెస్ గూటికి తలసాని?
సమైక్యవాదంతోనే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీనుంచి వైదొలగాలని తలసాని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. దీనిపై సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని తన అనుచరులతో ఆయన బుధవారం నగర శివార్లలోని శామీర్పేట ఫామ్ హౌస్ లో విందు సమావేశం నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో తనతోపాటు నగరం, శివారు ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థులు ఓడిపోవడానికి పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే కారణమని ఆయన విమర్శించారు. ఇదే నినాదంతో గ్రేటర్ ఎన్నికలకు వెళితే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. ఇకనైనా పార్టీ సమైక్యవాదాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. అదే జరగని పక్షంలో తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తనతో కలసి రావాలని అనుచరులను కోరారు.