మహారాష్ట్రకు లీగల్ నోటీసు: పొన్నాల
హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు నిర్మిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసును దాఖలు చేస్తామని ఆయన అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలుగుదేశం నాయకులు తమను నిందించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రాజెక్టు ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు, టెండర్లు పిలిచినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చే ఉండేది కాదని ఆయన అన్నారు. బాబ్లీపై తెలుగుదేశం పార్టీ తమపై అనవసర విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఈ రోజు నుంచే నాగార్జునసాగర్ జలాలను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.