నన్ను హింస పెట్టాలనే: కెసిఆర్
తెలంగాణ ఉద్యమానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కెసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పల్లెల్లోకి వెళ్లి వారం రోజులపాటు ప్రజల మధ్యనే ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేద్దామన్నారు. అన్ని పార్టీల మద్దతుతోపాటు పరోక్షంగా సీపీఎం సానుకూలతను కూడగట్టామని, కాంగ్రెస్ మాట తప్పటం వల్లే తెలంగాణ రాకుండా ఆగిందని తెలిపారు. ఇటీవల తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
ఎన్నికల్లో గెలవటమే ఉద్యమానికి ముఖ్యమన్నట్లు కొందరు (బహిష్కృతులు) మాట్లాడుతున్నారని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చన్నారు. ఇటీవలి ఎన్నికల్లో సీట్లు తగ్గినా 31.3 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. సీపీఎంకు ఒకటి, బీజేపీకి రెండు, సీపీఐకి నాలుగు, పిఆర్పీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయని, వాటిలో ఏ పార్టీకీ కూడా ఎంపీ సీటు ఒక్కటి కూడా దక్కలేదని తెలిపారు. ఉద్యమ సంస్థ తెరాసకు సీట్లు ముఖ్యం కాదన్నారు. పదవులను త్యజించి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు.
పొత్తుల వల్లే పద్మా దేవేందర్ రెడ్డికి స్థానం కల్పించలేక పోయామన్నారు. ఆమెను ఉన్నత స్థితికి తీసుకువెళ్లే బాధ్యత తనదని చెప్పారు. క్యాడర్ను కాపాడుకోవడానికే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని పద్మ విలేకరులకు తెలిపారు.