'చిరు'కు గుండు కొడితేనే..: ఈరన్న
కర్నూలు: చిరంజీవికి గుండు కొట్టిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో సీమ నేత పరిటాల రవి పవన్ కల్యాణ్కు గుండు కొట్టించాడని ఆయన శుక్రవారం కర్నూలులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పుడు ప్రజారాజ్యం తిరుగుబాటు నాయకులంతా ఏకమై గుండు చేయించుకోవాల్సిందిగా చిరంజీవిని కోరతామని చెప్పారు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ నెల 10న నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
ఎన్నికల్లో 104 మంది బీసీలకు టికెట్లిచ్చామని పేర్కొనడం పెద్ద బూటకమన్నారు. ఆ పేరుతో బరిలో దిగిన అభ్యర్థులంతా తమ కుల ద్రువీకరణ పత్రాలను మీడియా ముందుంచితే చిరంజీవి బండారం బయట పడుతుందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిరంజీవి బీసీ కార్డుతో వెళ్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈనెల 3న ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించారు.