ఎమ్మెల్యే రామారావు దీక్ష భగ్నం
హైదరాబాద్: కొవ్వూరు శాసనసభ్యుడు టీవీరామారావు నిరశన దీక్షను ప్రభుత్వం తీవ్ర ఉద్రిక్తల మధ్య మంగళవారం రాత్రి భగ్నం చేసింది. భారీ ఎత్తున పోలీసులను మోహరించి నాటకీయ పరిణామాల మధ్య ఆస్పత్రికి తరలించింది. ప్రజలు రాకుండా నిషేధాజ్ఞలు విధించింది. రామారావు దీక్షను భగ్నం చేయాలని చిక్కడపల్లి పోలీసులు మధ్యాహ్నం నుంచే ప్రయత్నాలు చేశారు. ఆ వైపు ప్రజలు, వాహనాలు రాకుండా బారికేడ్లు అడ్డంగా ఉంచారు. మధ్యాహ్నం, సాయంత్రం ఎమ్మెల్యేను పరీక్షించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యం క్షీణించిందని ప్రకటించారు. రక్తపోటు పడిపోయిందని, తక్షణం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ మోహరించిన పోలీసులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. రాత్రి 7.30కు చిక్కడపల్లి ఏసీపీ హరికుమార్, యాబైమంది పోలీసులతో వచ్చి ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అంబులెన్సును రప్పించి ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో తెదేపా పంపించిన మరో వైద్యుల బృందం వచ్చి రామారావును పరీక్షించింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటించింది. ఆయన ఆరోగ్యంపై ఆయనే మాట్లాడతారంటూ పేర్కొంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని ముఖ్యమంత్రి ఎక్కడకు నడిచి రమ్మంటే అక్కడకు వస్తానని చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్లి తనపై విషప్రయోగం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను కదలిస్తే అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అక్కడే ఉన్న తెదేపా నేతలు, కార్యకర్తలు కూడా పోలీసులకు అడ్డు పడ్డారు. దీంతో వారు అప్పటికి వెనక్కు తగ్గారు.
ఉన్నట్టుండి రాత్రి 10 గంటల ప్రాంతంలో దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ బృందం, మరో యాబైమంది పోలీసులు బిలబిలమంటూ వచ్చారు. పకడ్బందీ పథకంతో వచ్చీ రాగానే కార్యకర్తలను చెదరగొట్టారు. ఓ వైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడుతూనే మరో వైపు రామారావును బలవంతంగా చేతులపైకి ఎత్తుకున్నారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రతిఘటించినా లెక్కచేయకుండా అంబులెన్సులోకి ఎక్కించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ దశలో ఎమ్మెల్యే ఎంతగా ప్రతిఘటించినా వారు పట్టు సడలనీయలేదు. గాంధీలో తాను చేరనని ఎమ్మెల్యే భీష్మించుకోవడంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినా మళ్లీ దీక్ష కొనసాగిస్తానని రామారావు మీడియాతో అన్నారు. ప్రభుత్వం దురుద్దేశపూరితంగా వ్యవహరించిందని ఆయన కుమార్తెలు దివ్య, లక్ష్మి ఆరోపించారు. దీక్షను కొనసాగిస్తామంటూ శిబిరంలోనే కూర్చున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య వెంకటశేషారత్నం వెళ్లారు.
సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన రామారావు రెండోరోజు కూడా పోలీసులు బలవంతంగా తరలించేవరకు దీక్ష కొనసాగించారు. ఆయన భార్య వెంకట శేషారత్నం, కుమార్తె దివ్యారాణిలు కూడా దీక్షా శిబిరంలోనే ఉన్నారు. రామారావు ఉదయాన్నే లేచి శిబిరం వద్దఉన్న సులభ్ కాంప్లెక్స్లో కాలకృత్యాలు తీర్చుకున్నారు. అనంతరం శిబిరం వద్దే స్నానం చేశారు.