ఎమ్మెల్యే కూతుళ్ల దీక్ష కొనసాగింపు
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావు కూతుళ్లు బుధవారం నాడు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తమ దీక్షను కొనసాగిస్తున్నారు. తమ తండ్రిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించే వరకు దీక్ష కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. వారికి మద్దతుగా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కూడా దీక్షను సాగిస్తున్నారు.
విద్యార్థినిపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేశాడనే ఆరోపణపై తనపై కేసు బనాయించినందుకు నిరసనగా తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షను మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్సు పోలీసులు భగ్నం చేసి ఆయనను సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయనతో పాటు భార్య వెళ్లగా కూతుళ్లు దీక్ష కొనసాగిస్తున్నారు.
తనపై బనాయించిన అక్రమ కేసును ఉపసంహరించే వరకు దీక్ష సాగిస్తానని టీవీ రామారావు పట్టుబట్టారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసిన తర్వాత తిరిగి దీక్ష చేపడతానని ఆయన చెప్పారు. తొలుత ఆయన వైద్యచికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు.