స్వలింగ సంపర్కానికి ఢిల్లీ హైకోర్టు ఓకె
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం చట్టబద్దం చేసింది. ఐ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఐపిసి 377 సెక్షన్ సవరణ ద్వారా వయోజనుల్లో గే సెక్స్ ను నేరరహితంగా పరిగణించాలని చెప్పింది. ఈ తీర్పును వెలువరిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా, జస్టిస్ ఎస్ మురళీధర్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సమానత్వంపై చెప్పిన మాటలను ఉటంకించింది. సమానత్వమనే దాన్ని కేవలం పైపైనే చూడకూడదని, దాన్ని నిజమైన స్ఫూర్తితో చూడాలని నెహ్రూ అన్నట్లు బెంచ్ ఉటంకించింది. ఏ విధమైన వివక్ష అయినా సమానత్వ హక్కుకు వ్యతిరేకమైందేనని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పు భారత్ లో నివసిస్తున్న స్వలింగ సంపర్కులకు, గేలకు భావోద్వేగ పూరితమైందే. తమ హక్కుల కోసం వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇష్టం లేని సెక్స్ ను అంగీకరించని 377 సెక్షను కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హైకోర్టు తీర్పునకు ఢిల్లీ బయట ఉన్నవారు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తీర్పు తెలియజేస్తోంది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.