కాంగ్రెస్ ఎంపీలపై టిడిపి ఆగ్రహం
న్యూఢిల్లీ: మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రానికి చెందిన 33 మంది లోకసభ సభ్యులు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రానికి 33 మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగిందని సిపిఎం పార్లమెంటు సభ్యుడు మధు కూడా అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమతో కలిసి రావాలని ఆయన కోరారు. ఇదిలా వుంటే, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా రైల్వే బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె.కేశవరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.