ఆ పథకం పెద్దల కోసమే: సిపిఎం
హైదరాబాద్: సహకార వ్యవసాయం పేరుతో చిన్న కమతాలను నాశనం చేసి ఆ భూములను పెద్దకంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం అభిప్రాయ పడింది. రెండురోజులుగా ఇక్కడి ఆర్టీసీ కళాభవన్లో జరుగుతున్న సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశం ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి నీరు అమ్మే పథకం వల్ల బహుళజాతి సంస్థలకు రూ.10వేలకోట్ల వ్యాపారం చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. కొనుగోలు శక్తి లేని ప్రజలు మంచి నీటికి దూరమవుతారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి ప్రమాదకరమైన వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం యత్నిస్తోందని ప్లీనం పేర్కొంది. కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోందని, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులకు ప్రభుత్వం సహకరించాలని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని తీర్మానంలో పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులకు సిద్ధాంత ప్రభోదం చేసేందుకు సీపీఎం రాష్ట్రకమిటీ పూనుకుంది. తప్పులు దిద్దుకోడానికి ఒక అవకాశం ఇవ్వాలని, అప్పటికీ మారని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ తీర్మానించినట్లు సమాచారం.