'మమత' లేదు: వైయస్
వాస్తవానికి ఈ విషయంలో రైల్వే మాజీ మంత్రి లాలు ప్రసాద్ కు పలుమార్లు లేఖలు రాశానని, రాష్ట్ర ఎంపీలూ పలుమార్లు ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించారని గుర్తుచేశారు. మమత బాధ్యతలు చేపట్టాక మళ్లీ పరిస్థితిని నివేదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అదే సమయంలో రూ.50 వేల కోట్లతో బీహార్, తమిళనాడులలో రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం లభించడాన్ని వైఎస్ ప్రస్తావించారు. గడచిన ఐదేళ్లలో ప్రాజెక్టు వ్యయాన్ని భరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపని వైనాన్నీ గుర్తు చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మమతను కోరారు. అలాగే గతంలో మంజూరు చేసిన కొత్త రైల్వే లైన్ల పనులూ నిధుల లేమితో ప్రారంభం కాలేదని గుర్తుచేశారు.
హైదరాబాద్ జంట నగరాల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ ఫేజ్-2, కోటిపల్లి-నర్సాపూర్, మాచెర్ల-నల్లగొండ, కాకినాడ-పిఠాపురం, కడప-బెంగళూరు వంటి రైల్వే లైన్లుకు సంబంధించి నిధులు విడుదల కాలేదని వివరించారు. ఇందులో కొన్ని పనులకు రైల్వే శాఖ దశాబ్ద కాలం కిందటే అనుమతులిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వీటితోపాటు పలు ప్యాసింజర్ రైళ్ల కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ లేఖను తక్షణం పరిశీలించి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులకు తగినన్ని నిధులు, కొత్త లైన్లు, కొత్త ప్యాసింజర్ రైళ్లు మంజూరు చేయాలని మమతకు విజ్ఞప్తి చేశారు.