తానా వేదికపై రాజకీయ రగడ
చికాగో: అమెరికాలోని చికాగోలో తానా వేదికపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ రగడ అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు పరస్పరం విమర్శలకు, ప్రతివిమర్శలకు దిగారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పొత్తులే తెలుగుదేశం కొంప ముంచాయని, తెరాస, వామపక్షాలతో జతకట్టడాన్ని ప్రజలు వ్యతిరేకించారనీ ఆ పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తానా ఉత్సవాల్లో భాగంగా శనివారం చికాగోలో నిర్వహించిన రాజకీయ వేదికలో తెదేపా తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎర్రబెల్లి పాల్గొన్నారు. గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన రాష్ట్ర ప్రజలు ఈ సారి టిడిపికి అదే తీర్పు ఇచ్చారన్నారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓట్లు చీలడం వల్లే టిడిపికి మెజారిటీ రాలేదని, కమ్యూనిస్టులతో పొత్తు కూడా వికటించిందని చెప్పారు. టిడిపి నాయకులు 'ఆడలేక మద్దెల ఓడు' అన్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.
సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాను రాజకీయాలకు అతీతుడనని ప్రసంగం ప్రారంభించిన లక్ష్మీప్రసాద్ ముఖ్యమంత్రి కుమారుడు జగన్పై దుమారం లేపిన టిడిపి నాయకులు చంద్రబాబు కొడుకు లోకేష్ను మాత్రం క్రియాశీల రాజకీయాల్లోకి దింపారన్నారు. నగదు బదిలీ పథకం ఆయన సృష్టేనంటూ ప్రచారం చేశారని చెప్పారు. ప్రస్తుతం వారసత్వ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించకుండా ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని, హరికృష్ణ పార్టీ పెట్టేవాడు కాదని, తాను సైతం ఎంపీ కాలేకపోయేవాడినని లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి తీవ్ర అభ్యంతరం తెలిపారు. లక్ష్మీప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి అనుభవిస్తూ, ఆ పార్టీ ఏజెంటుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిలో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి అరుణ జోక్యం చేసుకొని 'మేం వేదికలపైనే ఇలా మాట్లాడుకొంటాం. మీరెందుకు ఆవేశపడుతున్నారు. మీకు కాలక్షేపం కోసమే ఈ వేదికపైకి వచ్చాం' అని ప్రకటించారు. ప్రజారాజ్యం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ఓట్లు ఎక్కువ శాతం వచ్చాయన్నారు.