టిడిపి ఎంపిల మధ్య గొడవలు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. పార్లమెంటరీ పార్టీనేత నామా నాగేశ్వరరావుపై చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సభలో, బయట మీడియా ప్రతినిధుల ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆయన రగిలిపోతున్నారు. మీడియా ప్రతినిధులు కూడా వివిధ విషయాలపై తనను సంప్రదించకుండా నేరుగా నామాతో మాట్లాడుతుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివప్రసాద్ తన అసంతృప్తిని మీడియా ముందే వ్యక్తం చేయడం ఆ పార్టీలోని గొడవలను బయటపెడుతున్నాయి.
లోక్సభలో సోమవారం ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, మైసూరారెడ్డి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. "ఏం అర్థమైందని అప్పుడే మాట్లాడుతున్నారు. బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తే బాగుంటుంది కదా" అని శివప్రసాద్ నామా, మైసూరాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సీనియర్ నాయకుడినైన తనను కాదని నామాను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడాన్ని శివప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో నామా కూడా సభ్యులందర్నీ కలుపుకొని పోవడం లేదనే వాదన ఉంది. ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి కావడంతో ఆయన రాజకీయ పరిణతి కనబరచలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి రావడమే మానేశారు. కొత్త ఎంపీలు ఒకరితో ఒకరికి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.