'ఇవియంలను ట్యాంపర్ చేయొచ్చు'
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ట్యాంపరింగ్ సాధ్యమేనని జన చైతన్య వేదిక అంటోంది. ఆ ప్రక్రియను ప్రదర్శించి చూపించింది. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, ఉపాధ్యక్షుడు వీవీరావు, ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రొఫెసర్ అరుణ్ మెహతా, నెట్ ఇండియా ప్రతినిధులు అరుణ్ కుమార్ కంకిపాటి, హరి కె.ప్రసాద్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో 'లైవ్ డెమో' నిర్వహించారు. ఈవీఎంల తరహాలో నెట్ఇండియా రూపొందించిన డమ్మీ కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను మీడియా ముందుంచి ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చో చూపించారు. జనచైతన్య వేదిక ప్రతినిధులు ఢిల్లీలో అందరి ముందే ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 35ఓట్లు పోలవగా వాటిలో రెండో బటన్కు 9 ఓట్లు వచ్చాయి. వీటిని వారు 17కు పెంచి ట్యాంపరింగ్ సాధ్యమేనని చూపించారు.
ఈ సందర్భంగా హరి కె.ప్రసాద్ మాట్లాడుతూ - ట్యాంపరింగ్ మాత్రమే కాకుండా ఎవరు ఏ సమయంలో ఎవరికి ఓటేశారో గుర్తించడానికీ ప్రస్తుత ఈవీఎంలలో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇది రహస్య ఓటింగ్ విధానానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. జనచైతన్య వేదిక ప్రతినిధులు లైవ్ డెమో నిర్వహించిన ఈవీఎంల ప్రోగ్రామింగ్, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ఈవీఎంల ప్రోగ్రామింగ్ ఒక్కటి కాదు. కానీ ఈసీ ఈవీఎంల ప్రోగ్రామింగ్ తెలిస్తే ఇక్కడిలాగే అక్కడా ట్యాంపరింగ్ చేయొచ్చని వారు తెలిపారు. ట్యాంపరింగ్ రహిత ఈవీఎంలను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
ఈవీఎంల ప్రతిపాదన 1989లో వచ్చినప్పటి నుంచి అందులో ట్యాంపరింగ్ జరగొచ్చన్న అనుమానాన్ని ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తున్నట్లు కంప్యూటర్ రంగ నిపుణుడు ప్రొఫెసర్ అరుణ్ మెహతా పేర్కొన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే కంప్యూటరు సాయంతో ప్రముఖులకు వివరించేందుకు ప్రయత్నిస్తే ఈవీఎంలు కంప్యూటర్లు కావంటూ కొట్టిపారేశారని తెలిపారు. ఈవీఎంలలోని కొన్ని చిప్లలో కోడ్లను మార్చడంద్వారా అక్రమాలు చేయవచ్చని చెప్పారు. ఈవీఎంలు ట్యాంపర్ చేసేందుకు వీల్లేదని ఈసీ నిరూపించేదాకా పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించేలా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండు చేయాలని సూచించారు. ఈవీఎంలపై పరిశీలనకు ఏర్పాటైన ఇందిరేశన్ కమిటీ కూడా వాటివల్ల గోప్యత దెబ్బతింటుందని స్పష్టం చేసినా ఈసీ పట్టించుకోవడం లేదని చెప్పారు. అందరికీ తెలిసిన పేపర్ బ్యాలెట్ను వదిలేసి జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వద్దనుకుంటున్న ఈవీఎం పద్ధతి మనకెందుకని ప్రశ్నించారు.