డబ్బిస్తామన్న వారితో కేసీఆర్ ...
హైదరాబాద్: పొత్తుల కోసం తెదేపా, ప్రరాపాలతో చర్చలు జరిపి ఎక్కువ డబ్బిస్తామన్న వారితో అంగీకారం కుదుర్చుకున్నారని జిట్టా బాలకృష్ణరెడ్డి విమర్శించారు.తెరాస అధినేతపై అసమ్మతి గళం వినిపించి పార్టీ నుంచి సస్పెండైన జిట్టా బాలకృష్ణరెడ్డి మరోసారి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కేసీఆర్ తిథులు, ముహుర్తాల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజల సమస్యల్ని, ఆకాంక్షల్ని విస్మరించారని దుయ్యబట్టారు. చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి నేతల్ని ఆర్థిక ప్రలోభాలు చూపి తిరిగి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కల్గించలేకే ఎన్నికల్లో ఓడిన విషయాన్ని ఒప్పుకోకుండా ఇతర పార్టీలపై నెట్టివేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న అధినేత వైఖరికి నిరసనగా తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిట్టా పాటు నల్గొండ జిల్లా నేతలు కొందరు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.