టిడిపిలో సంక్షోభం లేదు: జూ.ఎన్టీఆర్
తాత స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల ఆశీస్సులే తనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. పార్టీలోకి వ్యక్తులు రావడం, పార్టీని వీడడం సంప్రదాయంగా సాగేవేనని తెలిపారు. దీన్ని సంక్షోభంగా భావించలేమన్నారు. తాను కార్యకర్తగానే పార్టీకి సేవలంది స్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించానని, అయినప్పటికీ అన్న ఎన్టీఆర్ పేద ప్రజల కోసం స్థాపించిన టీడీపీ శ్రేయస్సును విస్మరించనని పేర్కొన్నారు. పార్టీలో యువతరం ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు.
పార్టీని వీడిన వాళ్లు తిరిగి తమ సొంత ఇంటికొచ్చే ప్రయత్నంలో ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల సంక్షేమాన్ని కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం వలన ప్రజాసంక్షేమం దిశగా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టగలదని పేర్కొన్నారు. పదవులే ప్రాతిపదికగా వ్యవహరించే నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండబోదని, కార్యకర్తలే ఆ నేతల స్థానాన్ని భర్తీ చేస్తారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ తదితరులున్నారు.