కాపలా కాదు వాడు కామ పిశాచి
హైదరాబాద్: ఒక ప్రభుత్వ హాస్టల్ వాచ్ మన్ అమాయకపు బాలికలను లొంగదీసుకున్న వైనమిది. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం తోర్మామిడి గ్రామానికి చెందిన బాలిక 2003లో బషీరాబాద్ ఎస్సీ బాలికల వసతి గృహంలో చేరింది. హాస్టల్లో ఉంటూ స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొంటోంది. తొమ్మిదో తరగతి వరకు ఆ హాస్టల్ లోనే ఉండి చదువుకొంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అయితే..అక్కడ వసతి లేకపోవడంతో ఈ ఏడాది బీసీ హాస్టల్ లో చేరింది.
ఎస్సీ హాస్టల్లో ఉంటున్న సమయంలో అక్కడి వాచ్ మన్ మత్తప్ప (55) రాత్రి వేళల్లో అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడు. మాయమాటలు చెప్పి కొందరు బాలికలను లోబరుచుకున్నాడు. ఎవరైనా ఎదురు తిరిగితే బయట చెడు తిరుగుళ్లు తిరుగుతున్నావని మీ తల్లిదండ్రులకు చెబుతానని విద్యార్థినులను బెదిరించేవాడు. ఇలా ముగ్గురు అమ్మాయిలను లోబరచుకున్నాడు. ఏడాదికాలంగా వారిపై అత్యాచారం జరుపుతున్నాడు.
అయితే..ప్రస్తుతం బీసీ హాస్టల్లో ఉంటున్న ఓ అమ్మాయికి గురువారం రాత్రి కడుపు నొప్పి వచ్చింది. దీంతో బీసీ హాస్టల్లోని వాచ్ ఉమన్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బాలికను పరీక్షించిన డాక్టర్ ఆమె గర్భం దాల్చిందని చెప్పడంతో వార్డెన్ ఈ విషయాన్ని బాలిక తల్లికి సమాచారం అందించారు. అదేసమయంలో రెండు మూడు రోజుల కిందటే బాలికను గమనించిన మత్తప్ప ఆమెను తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించినట్లు బాలిక చెప్పింది.
శుక్రవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన డాక్టర్...ముందుగా కొన్ని మందులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించింది. తనతోపాటే మరో ఇద్దరు అమ్మాయిలను కూడా మత్తప్ప లోబరచుకున్నట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడు మత్తప్ప పరారీలో ఉన్నాడు. మరోపక్క, తాండూరు డీఎస్పీ సుధాకర్ శుక్రవారం బీసీ హాస్టల్ కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.