నువ్వు యూజెలెస్ ఫెలో:నాగం
మహబూబ్నగర్: నువ్వు యూజ్లెస్ ఫెలో! టీడీపీ ఎమ్మెల్యేలు బిచ్చగాళ్లు! నువ్వు బియ్యం రెడ్డివి!! వాడెవడు నన్ను అడగడానికి.. జాగ్రత్తగా మాట్లాడు.. మహిళా మంత్రివని ఊరుకుంటున్నా అంటూ జిల్లా సమీక్ష సమావేశంలో టీడీపి ఎమ్మెల్యేలపై కాంగ్రేస్ మంత్రులు విరుచుకుపడ్డారు. దీనికి తగినట్లుగానే తెదేపా ఎమ్మెల్యేలూ దీటుగా స్పందించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డిలు వాగ్యుద్ధానికి దిగారు. తొలుత టీడీపీ సభ్యులను ఉద్దేశించి కాగితం పులులు అని ఇన్చార్జి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రావుల చంద్రశేఖరరెడ్డి చర్చకు పెట్టారు. 'అవును మీరు కాగితం పులులే' అంటూ కోమటిరెడ్డి మరోసారి అదే వాదన చేశారు.
దీనికి ఆగ్రహించిన నాగం జనార్దనరెడ్డి.. జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఇన్చార్జి మంత్రిని యూజ్లెస్ ఫెలో అని తిట్టారు. తమపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో కోమటిరెడ్డికి కోపం వచ్చింది. మీరే పద్ధతి మార్చుకోవాలంటూ ఎదురుదాడికి దిగారు.
'మీరు బియ్యంరెడ్డి అని మాకు తెలుసు.బియ్యం తినే ఖర్మ మాకు పట్టలేదు' అంటూ కోమటిరెడ్డి ఘాటుగా విమర్శించారు. దీంతో మండిపడ్డ నాగం.. 'నేను బియ్యం తిన్నట్లు నిరూపించక పోతే రాజీనామా చేసి ముక్కు భూమికి రాస్తావా?' అని సవాలు విసిరారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు తొమ్మిది మందీ లేచి నిలబడి.. మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో చర్చ పక్కదారి పట్టింది. దయాకర్రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'ఇక్కడే అధికారులంతా ఉన్నారు.. అడగండి..' అని అన్నారు. దీంతో వెంకట్రెడ్డి, అరుణ ఇక చర్చ పొడిగించలేదు.