ఉగ్రవాది ముజీబ్ కు జీవిత ఖైదు
హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన కేసులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ముజీబ్ అలియాస్ అహ్మద్ బాయ్ ని హైదరాబాదులోని నాంపల్లి ఒకటో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి గురువారం దోషిగా నిర్ధారించారు. అతనితో పాటు అతని అనుచురులు ఆరుగురిని కూడా దోషులుగా నిర్ధారించారు. హైదరాబాదులోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ముజీబ్ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించినట్లు అభియోగం మోపారు.
రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి పాలరాతిని రవాణా చేసే లారీలో ఆయుధాలను తీసుకు వస్తుండగా 2005 డిసెంబర్ 27వ తేదీన అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముజీబ్, క్లీనర్ రవీంద్ర కుమార్, షబ్బీర్ అహ్మద్ ల నుంచి పోలీసులు శాటిలైట్ ఫోన్, 1.15 లక్షల రూపాయల నగదు, రెండు సిడీలు, రెండు సెల్ ఫోన్లు, 2.9 లక్షల రూపాయల చెక్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు పోలీసులు ముజీబ్ పై, అతడికి సహకరించిన 19 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో ముజీబ్ ను పోలీసులు హైదరాబాదు తరలించారు.
గతంలో ఐపియస్ అధికారి కృష్ణప్రసాద్ హత్య కేసులో కూడా ముజీబ్ నిందితుడు. ఈ కేసులో జీవిత ఖైదు పడింది. అయితే ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో 2004లో జైలు నుంచి విడుదలయ్యాడు. హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారని ముజీబ్ ఆరోపిస్తున్నాడు.