జగన్ కాకుంటే పార్టీలో చీలిక?
జగన్ కోసం అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ మద్దతు కూడగట్టే ప్రయత్నం పెద్ద యెత్తున జరుగుతోంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఏర్పాటు చేస్తే అటో ఇటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో జగన్ వర్గీయులు ఉన్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు మాత్రం జగన్ కే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అది మాత్రమే సరిపోదు. పార్టీ అధిష్ఠాన వర్గం ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితే కాంగ్రెసులో ఉంటుంది. అయితే ఒత్తిడి ద్వారా కాంగ్రెసు అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ లాబీ ఉంది. అయితే ఈ లాబీ ఒత్తిడి వ్యవహారాలు శృతి మించుతున్న దాఖలాలు ఉన్నాయి. పార్టీని చీలుస్తామనే పద్ధతిలో హెచ్చరికల వ్యవహారం నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పుడు ఒత్తిడిని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ఎలా తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.