సయీద్ పై చర్య చేపట్టాల్సిందే: కృష్ణ
న్యూయార్క్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ ను ముంబై దాడుల కేసులో పాకిస్తాన్ ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎం కృష్ణ డిమాండ్ చేశారు. ముంబై దాడుల సూత్రధారి సయీద్ అనే విషయంలో తమ వైఖరిలో ఏ విధమైన అస్పష్టత లేదని ఆయనఅన్నారు. న్యూయార్క్ లోని ఓ న్యూస్ చానెల్ తో ఆయన మాట్లాడారు. ముంబై దాడుల కుట్రదారులను శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు.
సయీద్ పై చర్య విషయంలో పాకిస్తాన్ చర్యలపై రకరకాల కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేదే తమకు కావాల్సిందని, ముంబై దాడుల కేసులో సయీద్ పై కేసులు పెట్టాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో పాకిస్తాన్ వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఆయన అన్నారు. కంటి తుడుపు చర్యలను తాము అనుమతించబోమని ఆయన అన్నారు. సయాద్ పై కేసు పెట్టే విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.