హక్కుల నేత బాలగోపాల్ కన్నుమూత
పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన బాలగోపాల్ రచయిత, మేధావి. ఆయన మానవ హక్కులపై, ఆర్థికాంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. నక్సల్బరీ ఉద్యమం, గమ్యం గమనం గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఆయన రాసిన రూపం - సారం సాహిత్యలోకంలో అనన్య సామాన్య గ్రంథంగా నిలుస్తుంది. ఆయన అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం గ్రామంలో 1957 జన్మించారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సీ)కి గుండెకాయగా నిలిచిన ఆయన తదుపరి దాంతో విభేదించారు. మానవ హక్కుల వేదికను స్థాపించి పని చేయడం ప్రాంరభించారు.
వరంగల్ లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో గణితంలో పిహెచ్డీ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. 1985లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం హక్కుల ఉద్యమానికి అంకితమయ్యారు. అప్పటి నుంచి హైదరాబాదును కేంద్రంగా చేసుకుని రాజ్యహింసపై నిరంతరం పనిచేసుకుంటూ వచ్చారు.రాష్ట్రంలో ఆయన తిరగని తెలంగాణ పల్లె లేదంటే అతిశయోక్తి లేదు. బెదిరింపులను, నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఆయన పని చేశారు. బుద్ధిజీవిగా, కార్యశీలిగా ఆయన రెండు బాధ్యతలూ మోశారు.