చికాగోలో పురందేశ్వరి సందడి
ఈ సదస్సులో చికాగోలో స్థిరపడిన భారతీయులు, ప్రధాని సలహాదారు(మౌలిక సదుపాయాలు) శ్యాం పిట్రోడా, అక్కడి భారత రాయబారి శారద మీనన్, ఇండియన్ కాన్సల్ జనరల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో పురంధేశ్వరి ప్రసంగించారు.
భారత్, అమెరికా సంబంధాలపై మహాత్మాగాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలను ఉటంకిస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా మన ప్రధానికి ఓ సందేశాన్ని పంపారని పురేందేశ్వరి గుర్తు చేశారు. అదే సందేశంలో తదుపరి జరిగే సదస్సుకు ప్రధానిని 'ఫస్ట్ స్టేట్ గెస్ట్'గా రావాలని కోరారని వివరించారు. ఇలాంటి ఆహ్వానం రావడం మనకెంతో స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ సందర్భంగా చికాగోలో పురందేశ్వరి గౌరవార్థం కాన్సల్ జనరల్ వారు విందు ఏర్పాటు చేశారు. చికాగోలో స్థిరపడిన దాదాపు 200 పైగా భారతీయులు ఇందులో పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయ, సహకారాలు అందించాలని సదస్సులో ప్రవాస భారతీయులను మంత్రి కోరారు. దీనికి స్పందిస్తూ అక్కడే స్థిరపడిన గుజరాత్వాసి రాజేష్ పటేల్ 10,000, డాక్టర్ అక్కినేని సుదర్శన్ 5,000, డాక్టర్ రావు అచంట 5,000 అమెరికన్ డాలర్లు అందించడానికి ముందుకొచ్చారు.
మంత్రి పురందేశ్వరి ఈ నెల 13న ఇండియానా పోలీస్ లోని పర్డ్యూ యూనివర్సిటీ, 14న యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలను సందర్శిస్తారు. నూజెర్సీలో స్థిరపడిన భారతీయులు 18వ తేదీన ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు.