చిరూ! పబ్లిక్ లోకి రా !: మోహన్ బాబు
మన ఇంటిలో సంభవించిన విపత్తుగా భావించి వరద బాధితులకు సహాయపడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. అసందర్భమైతే తప్ప అందరూ రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాను ముంబైలో ఉన్నప్పటికీ సోదరుడు బాలకృష్ణ చొరవ ప్రదర్శించి ఫోన్ చేయగానే తాను వచ్చానని ఆయన అన్నారు. ప్రతి సందర్భంలోనూ తగిన సహాయం అందించడానికి తాను ముందున్నానని ఆయన చెప్పారు. సహాయం చేసే విషయంలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనక ఉన్నారనేది ముఖ్యం కాదని, ఏం చేస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. తన కుమారులు విష్ణువర్దన్, మనోజ్ కుమార్, కూతురు లక్ష్మీప్రసన్న ఏం చేస్తారో చూస్తారని ఆయన అన్నారు. ఒక రోజు తినడానికి కూడా తిండి లేదని, ఇప్పుడు ప్రజాశీస్సుల వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని, వారు బాధలో ఉన్నప్పుడు ఆదుకోవడం బాధ్యతగా భావిస్తానని ఆయన చెప్పారు.
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ జోలె పట్టారని, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కూడా ఆ సేవలు చేశారని, వారి బాటలో మనం నడవాలనేది తన ఉద్దేశమని, మనం ఉడుతా భక్తిగా సాయం చేస్తామని, ఆ తర్వాత జోలె పడతామని ఆయన అన్నారు. ఎవరి నుంచో తాను నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చిరంజీవి టీవీ ద్వారానే మాట్లాడారు కాబట్టి తాను కూడా టీవీ ద్వారానే సమాధానం ఇస్తున్నానని, లేకుంటే ఫోన్ చేసి మాట్లాడి ఉండేవాడినని ఆయన అన్నారు.