అడ్డం తిరిగిన 'సాక్షి' కుట్ర కథ
ఆ వార్తా కథనంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉంది. ఒక గొప్ప నాయకుడి విషాదాంత మరణాన్ని వివాదం చేయడం సరి కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలోనే మరణించారని తాము భావించామని, అయితే ఇప్పుడు కొత్త వాదనలు వినిపిస్తున్నాయని, వైయస్ హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు వస్తున్నాయని, దీనిపై కూడా సిబిఐ, ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తాయని ముఖ్యమంత్రి కె.రోశయ్య మంగళవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు.
కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన రాష్ట్ర భద్రతా సలహా సంఘం చైర్మన్ కెవిపి రామచందర్ రావును, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సాక్షి వార్తాకథనం ఇరకాటంలో పెట్టింది. సాక్షి వార్తాకథనాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ వారిద్దరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కెవిపి రామచందర్ రావు పేరు ప్రస్తావించకుండా భద్రతా సలహా సంఘం చైర్మన్ తప్పుకోవాలంటూ ఆయన మంగళవారం ఢిల్లీలో డిమాండ్ చేశారు. ఆ పదవిని ఎందుకు సృష్టించారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదానికి బాధ్యత వహించి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు. మధుయాష్కీ డిమాండ్ పై కెవిపి రామచందర్ రావు మీడియా ప్రతినిధుల వద్ద నేరుగా స్పందించలేదు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని అడిగితే మీరు ఏదంటే అది అని అన్నారు. ఈ వివాదంతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన సూచనలు కనిపిస్తున్నాయి. పదవులు శాశ్వతం కాదని ఆమె వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమె మంగళవారంనాడు వైయస్ జగన్ ను కలిశారు.
మొత్తం మీద హనుమంతుడిని చేయబోతే కోతిగా మారినట్లు దేన్నో ఉద్దేశించి తన దినపత్రిక, సాక్షిలో వైయస్ జగన్ ప్రసారం చేయించిన కుట్ర కథ అడ్డం తిరిగింది.