టిడిపి ఎమ్మెల్యే సీతపై కేసు?
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి మరణ వాంగ్మూలంలో ఈ ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళ కారణంగానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళను తట్టుకోలేకపోయిన తాను ఇక తన తనువును చాలించాలనే శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నానని రాజేశ్వరి మరణవాంగ్మూలంలో స్పష్టం చేసింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రాజేశ్వరి నుంచి మరణ వాంగ్మూలాన్ని పోలీసు అధికారులు తీసుకున్నారు. రాజేశ్వరి మరణించిన నాలుగు రోజుల తరువాత ఆమె మరణ వాంగ్మూలం వెలుగు చూసింది.
దేవరకద్ర మండలంలో మంజూరైన స్ప్రింక్లర్లను తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఈ ప్రజాప్రతినిధులు తనపై తీవ్రం ఒత్తిడి తీసుకువచ్చి, మానసిక వేదనకు గురిచేశారని మరణవాంగ్మూలంలో రాజేశ్వరి స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, అలా చేయకపోతే వారి నుంచి ఇబ్బందులు తప్పవన్న భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు రాజేశ్వరి వెల్లడించింది. తన మనుషులకు రెండు స్ప్రింక్లర్లు ఇవ్వాలని జడ్ పిటిసి ప్రదీప్ గౌడ్ ఒత్తిడి చేశారని, ఎమ్మెల్యే సీతా దయాకరరెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు భారతీరెడ్డి కూడా తాము చెప్పిన వారికే స్ప్రింక్లర్లు ఇవ్వాలంటూ వేధించారని రాజేశ్వరి పేర్కొంది.