వచ్చే వారంలో రోశయ్య ఢిల్లీకి
సీఎల్పీ సమావేశం తేదీని ప్రకటించడానికి ముందే రోశయ్య సోనియా గాంధీని కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ఢిల్లీ రావాల్సిందిగా ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. అధినేత్రికి రోశయ్య రాష్ట్ర పరిస్థితులనూ పూర్తిగా వివరించే అవకాశం ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అనంతరం సీఎల్పీ భేటీకి సంబంధించి అధిష్ఠానం నెలాఖరులోగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. ఇక... వైఎస్ మరణించి 54 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు సంతాపాన్ని తెలపలేకపోవడంపై పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే అధిష్ఠానం చెవికి చేరింది.
అయితే, సీఎల్పీ సమావేశానికి ప్రత్యేకంగా పరిశీలకులను పంపకుండా మొయిలీ, పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కృష్ణమూర్తితోనే వ్యవహారాన్ని నడిపించేస్తారా లేక రోశయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మంత్రి పృథ్వీరాజ్ చవాన్ను కూడా ప్రత్యేక పరిశీలకునిగా పంపుతారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. చవాన్ను కూడా పంపించి.. అంతా నిబంధనల మేరకే జరిపించే అవకాశం లేకపోలేదని ఆ వర్గాలు అంటున్నాయి. ఇక, సీఎల్పీ నేతగా రోశయ్య పేరును జగన్తోనే ప్రతిపాదింపజేయడమే కాక, ఎమ్మెల్యేల ఆమోదం పొందేలా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.