హైదరాబాదుకు కర్నాటక రాజకీయాలు?
పార్టీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నప్పుటికీ దిగి రావడానికి గాలి సోదరులు నిరాకరిస్తున్నారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో హైదరాబాదులో క్యాంపు ఏర్పాటు చేసేందుకు గాలి సోదరులు సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. గాలి సోదరులు ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరినట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా శాసనసభ్యులు తమ నుంచి జారిపోకుండా హైదరాబాదులో క్యాంపు నిర్వహించాలని గాలి సోదరులు భావించినట్లు చెబుతున్నారు. గాలి సోదరులకు అండగా ఉన్న 18 మంది శాసనసభ్యులను హైదరాబాదు శివారులోని ఓ రిస్టార్ లో ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయమే బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు. ఆయన బెంగుళూర్ వెళ్లడంలో మతలబేమైనా ఉందనే విషయంపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే జగన్ ప్రధాన కేంద్రం చాలా కాలంగా బెంగుళూరే కావడం వల్ల అందులో ప్రత్యేకతేమీ లేదని అంటున్నారు.