తెలియకుండానే మృత్యువులోకి వైయస్సార్
ప్రమాదం సంభవించబోతున్నట్లు పైలట్లకు కూడా తెలియలేదని ఆ పత్రిక రాసింది. హైదరాబాద్, చిత్తూరు మధ్య తాము మార్గం తప్పిపోయామని కూడా పైలట్లు గుర్తించలేదని, తాము గమ్యం వైపే వెళ్తున్నామని అనుకున్నారని ఆ వార్తాకథనం సారాంశం. వర్షం కారణంగా ఎదురుగా ఉన్న కొండ పైలట్లకు కనిపించలేదని, మార్గం సాఫీగానే ఉందని భావించారని అంటున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ 259 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు.
వైయస్సార్ మృతిపై జరుగుతున్న దర్యాప్తు ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. హెలికాప్టర్ లో 2 గంటల 45 నిమిషాలకు సరిపడే ఇంధనం మాత్రమే ఉంది. చెన్నై రాడార్ కు హెలికాప్టర్ నుంచి సంకేతాలు ఉదయం 9 గంటలకు 13 నిమిషాలకు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంల పైలట్లు మౌనంగా ఉన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి సేద తీరుతుండడం వల్ల వారు సాధారణ విషయాలు కూడా మాట్లాడుకోలేదని చెబుతున్నారు. క్యాబిన్ లో పూర్తి నిశబ్దం అలుముకున్నట్లు సివిఆర్ ను డీకోడ్ చేసిన తర్వాత తేలింది.