గుడి వద్ద రాసలీలలపై రహస్య విచారణ
ఎలక్ట్రికల్ విభాగం అధికారిణి ప్రసన్న కుమారి, ఈవో పిఎ రమణారావు రాసలీలలు జరుపుతుండగా సిసి కెమెరాలకు చిక్కారు. ఆ వివరాలివి : బెజవాడ కనకదుర్గమ్మ గుడి ప్రాంగణంలోనే రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆలయం ఉద్యోగులే నీచానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బట్టబయలైంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఆలయం ఉద్యోగి ఒకరు మరో ఉద్యోగినితో రాసలీలలు నెరపుతున్న దృశ్యాలను సిసి కెమెరా బంధించింది.
ఈ సమాచారం బయటికి పొక్కడంతో సంచలనం చెలరేగింది. ఆలయం కార్యనిర్వహణాధికారి పి.ఎ.గా ఉన్న రమణారావు దుర్గగుడి ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగినితో నిర్వహిస్తున్న రాసలీలల దృశ్యాలు సిసి కెమెరాలో చిక్కాయి. దేవాదాయ కమిషనర్ సుందరకుమార్ ఆలయంలో ఉండగానే ఈ వ్యవహారం జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దుర్గ గుడి బోర్డు సమావేశం హాలులో ఆ ఉద్యోగి దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మహిళా ఉద్యోగినిని ముద్దు పెట్టుకుంటుండగా సిసి కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే ఆలయం అధికారులు సిసి కెమెరా ఉన్న గదికి తాళం వేశారు. గుడి పవిత్రత కంటే సమావేశమే ముఖ్యమని అధికారులు వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. ఇలా ఉండగా ఎంతో పవిత్రంగా తామంతా భావిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఉద్యోగులు నీచమైన పనులకు పాల్పడడంతో భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. గుడిలో అపచారాలు ఎన్నోసార్లు జరుగుతున్నాయని, అయితే, సిసి కెమెరాలో చిక్కడం మాత్రం ఇదే తొలిసారి అని భక్తులు ఆరోపిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన ఆలయం ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.