గాలి కేసులకు బెదిరేది లేదు: బాబు
ఓబుళాపురం మైనింగ్ పై రాష్ట్రపతికి, ప్రధానికి, సిబిఐకి, సివిసికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుమతులిచ్చిందని ఆయన విమర్శించారు. గెలాక్సీ, ముడి ఇనుము ఎగుమతికి తమ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిబంధనలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అక్రమ వ్యాపారం కోసం ఒక్కటయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెల్లించిన ముందస్తు పన్ను ప్రకారం వార్షికాదాయం 70 కోట్ల రూపాయలపైనే ఉంటుందని ఆయన చెబుతూ అంత ఆదాయం ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని డిఎఫ్ఓ కూడా నిర్ధారించారని ఆయన చెప్పారు. ఓబుళాపురం కంపెనీ నిబంధనలను అతిక్రమించి చారిత్రక అవశేషాలను కూడా ధ్వంసం చేసిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఓబుళాపురం కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఆయన చెప్పారు.
మైనింగ్ మాఫియా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచారణాధికారి సమ్మిరెడ్డి నిజాలను తేల్చేది ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మైనింగ్ ను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మిరెడ్డి కమిటీ తేల్చేది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. త్రిసభ్య కమిటీ విచారణ బహిరంగంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులను నిర్ణయించే జిటిఎస్ ను కూడా కూలదోశారని ఆయన అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఉమ్మడి విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబుళాపురం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ప్రజారాజ్యం, బిజెపిలు హాజరు కాలేదు. తాము కాంగ్రెసు పార్టీని మినహా అన్ని పార్టీలను ఆహ్వానించామని చంద్రబాబు చెప్పారు.