ముంబైలో దొరికిన హెడ్లీ ఇంటి ఆచూకీ
ఆ అపార్టుమెంటు అమెరికా కాన్సులేట్ కు అతి సమీపంలో ఉంది. నిరుడు ఏప్రిల్ నుంచి దాదాపు ఏడాది పాటు సింధీ దంపతుల వద్ద అతను ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్లీతో పాటు అతని సహచరుడు రాణా భారత్ లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు వారు ఎక్కడెక్కడ సంచరించారనే విషయాన్ని కనిపెట్టడంలో మునిగిపోయాయి. తమ పాటు ఉన్న హెడ్లీ స్వీట్, చార్మింగ్ బాయ్ గా సింధీ దంపతులు అన్నారు. తమకు అతను ఏ విధమైన సమస్యను సృష్టించలేదని 75 ఏళ్ల శ్రీమతి కృపలానీ అన్నారు. ఆమె భర్త ఇటీవలే మరణించాడు. వారం రోజుల పాటు ఇంట్లో ఉండి రెండు, మూడు నెలల పాటు తిరగడానికి వెళ్లిపోయే వాడని ఆమె చెప్పింది.
ముంబై దాడులతో హెడ్లీ, రాణాలకు సంబంధం ఉందనే కోణం నుంచి కూడా దర్యాప్తు జరుగుతోంది. ముంబై దాడుల నిందితుడు కసబ్ వారికి తెలుసునని అనుమానిస్తున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూర్ పేలుళ్లతో వారి పాత్రను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.